మే3తో లాక్డౌన్ గడువు ముగియనందున ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యి వివిద రాష్ట్రాలలో కరోనా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ పొడిగింపు గురించి కూడా వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దేశంలో గ్రీన్ జోన్ (319), ఆరెంజ్ జోన్ (284), రెడ్ జోన్ (130) జిల్లాలుగా విభజిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. కనుక ఆ జోన్ల ఆధారంగా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగించడం లేదా తగ్గించడం చేయబోతున్నట్లు భావించవచ్చు. రెడ్జోన్ జిల్లాలోలో యధాతధంగా లాక్డౌన్ ఆంక్షలను కొనసాగిస్తూ, ఆరెంజ్ జోన్లో కొంతవరకు, గ్రీన్ జోన్ జిల్లాలలో పూర్తిగా ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. అయితే గ్రీన్-ఆరెంజ్ జోన్ జిల్లాల మద్య రాకపోకలకు ప్రజలను అనుమతిస్తుందా లేదా?ఈ జిల్లాల మద్య బస్సులు, రైళ్లు, విమానాలు వంటి ప్రజారవాణా వ్యవస్థలను అనుమతిస్తారా లేదా అనే విషయం శనివారం ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించినప్పుడు స్పష్టతనీయవచ్చు.
లాక్డౌన్ చేస్తున్నప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నందున లాక్డౌన్ యధాతధంగా కొనసాగించవలసిన అవసరం ఉంది. కానీ లాక్డౌన్ ఇంకా కొనసాగిస్తే దేశంలో కరోనా మరణాల కంటే ఆకలి చావులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నందున, గ్రీన్, ఆరెంజ్ జోన్ జోన్ జిల్లాలలో పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేసే అవకాశాలున్నాయి.