ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నా ఇంతవరకు ఆ దేశ ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో ఇప్పుడు అతను బ్రతికే ఉన్నాడా లేక అనారోగ్యంతో మరణించాడా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అధికబరువు, బీపీ వగైరా ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న కిమ్ జోంగ్ ఉన్ చాలా విపరీతంగా సిగరెట్లు కాలుస్తుంటారు. కనుక హటాత్తుగా ఆయన ఆరోగ్యం చెడిందని అందుకే అధికారిక కార్యక్రమాలకు, సమావేశాలకు హాజరుకావడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు కరోనా సోకినందున ఐసోలేషన్లో ఉన్నారని కాదు... బ్రెయిన్ డెడ్ అయ్యిందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే వాటిని అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ఖండిస్తున్నాయి కానీ ఉత్తర కొరియా ఖండించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతాసలహాదారు మునిసిపల్ కార్పోరేషన్ చుంగ్ స్పందిస్తూ, ఉత్తర కొరియాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ఆ దేశంలో కొత్తగా ఎటువంటి రాజకీయ హడావుడి కనిపించడం లేదని చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఏప్రిల్ 13 నుంచి ఆయన ఉత్తర కొరియాలో వాన్సన్ అనే ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు.
అమెరికాకు చెందిన వాషింగ్టన్ 38 నార్త్ ప్రాజెక్ట్ అనే ఓ సంస్థ మరో ఆసక్తికరమైన విషయం బయటపెట్టింది. ఉత్తర కొరియా అధ్యక్షుడి కుటుంబం మాత్రమే వినియోగించే ఓ ప్రత్యేక రైలు వారు మాత్రమే విశ్రాంతి తీసుకొనే ఓ ప్రాంతంలో ఉపగ్రహచిత్రాలలో కనిపించినట్లు పేర్కొంది. దానిని బట్టి ఆయన ఆ ప్రాంతంలో విశ్రాంతి తీసుకొంటుండవచ్చని పేర్కొంది. కానీ తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి గురించి వినిపిస్తున్న ఈ ఊహాగానాలను ఉత్తరకొరియా ప్రభుత్వం ఖండించడం లేదు. కనీసం స్పందించడం లేదు.