కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా పరిస్థితులపై అధికారిక ప్రకటన చేశారు. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 1,035 కేసులు నమోదు అయ్యాయని వాటితో కలిపి మొత్తం 7,447 కేసులు అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 642 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్లారని చెప్పారు. గడిచిన 24 గంటలలో మొత్తం 40 మంది కరోనాతో మృతి చెందారని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 239 మంది చనిపోయారని లవ్ అగర్వాల్ తెలిపారు.
కరోనాను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన 586 ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, లక్షకుపైగా ఐసోలేషన్ బెడ్స్ సిద్దంగా ఉన్నాయని తెలిపారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన లాక్డౌన్, కరోనా నివారణ చర్యల వలన దేశంలో కరోనా చాలా అదుపులో ఉందని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనదేశంలో కూడా సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యుండేవి. సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలము,” అని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది. ఇప్పటివరకు 45 మంది కోల్కోన్నారు. 12 మంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 381కి చేరింది. ఇప్పటివరకు 10 మంది కోల్కోన్నారు. ఆరుగురు మృతి చెందారు.