డిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్ళివచ్చినవారిలో ఎక్కువమంది హైదరాబాద్లోనే ఉండటంతో నగరంలోనే 175 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కనుక నగరంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన 12 ప్రాంతాలను క్లస్టర్ కంటెయినర్లుగా జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ ఈరోజు ప్రకటించారు. కనుక ఇక నుంచి ఆ 12 ప్రాంతాలపై పోలీసులు, ఆరోగ్యశాఖ, మునిసిపల్ శాఖల సిబ్బంది ప్రత్యేకశ్రద్ద పెడతారు. ఆ ప్రాంతాలలోని వారిని బయటకు వెళ్ళనీయకుండా, బయటవారిని లోపలకు ప్రవేశించనీయకుండా పోలీసులు పహరా కాస్తారు. ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతీ ఇంటికీ వెళ్ళి ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైన చర్యలు చేపడతారు. మునిసిపల్ సిబ్బంది ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ కీటకనాశిని మందులను పిచ్చికారీ చేస్తుంటారు.
క్లస్టర్ కంటెయినర్లుగా ప్రకటించిన ప్రాంతాలు ఇవే:
చందానగర్, బాలాపూర్, తుర్కపల్లి, యూసఫ్ గూడా, కూకట్పల్లి, మూసాపేట, మలక్ పేట, రాంగోపాల్ పేట, షేక్ పేట, కుత్బుల్లాపూర్, గాజులరామారం, ఆల్వాల్, చేగూరు, మయూరీనగర్, చాంద్రాయణగుట్ట, రెడ్ హిల్స్.