టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులను సిఎం కేసీఆర్ ఈరోజు ఖరారు చేశారు. వచ్చే నెల పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, మాజీ శాసనసభ స్పీకర్ సురేశ్ రెడ్డికి సీట్లు ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్ధులను శాసనసభ్యులు ఎన్నుకొంటారు కనుక వారిరువురి ఎన్నిక లాంఛనప్రాయమే. విశేషమేమిటంటే వారిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారే. సిఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ లోక్సభ ఎన్నికలలో అనూహ్యంగా బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోవడంతో, గత ఏడాది మంత్రివర్గ విస్తరణలో ఆమెను తన క్యాబినె ట్లోకి తీసుకొంటారని ఊహాగానాలు వినిపించాయి. కానీ సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కే.కేశవరావు స్థానంలో తన కుమార్తె కవితను రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ సిఎం కేసీఆర్ కే.కేశవరావుకే మళ్ళీ అవకాశం కల్పించడం విశేషం. కనుక సిఎం కేసీఆర్ ఆమెకు ఎటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.