మాజీ ఎంపీ కవిత నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోవడంతో తెరాసలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికవడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ శాసనసభా స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్నాయి. కనుక సిఎం కేసీఆర్ ఆమెను హుజూర్నగర్ నుంచి శాసనసభకు పోటీ చేయించి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కానీ ఆమె హుజూర్నగర్ నుంచి పోటీ చేయడం కంటే జగిత్యాల నుంచి పోటీ చేస్తే బాగుంటుందని జగిత్యాల తెరాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఒకవేళ ఆమె జగిత్యాల నుంచి పోటీ చేయదలచుకొంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ అంశంపై సిఎం కేసీఆర్, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తుది నిర్ణయం తీసుకొంటారని సంజయ్ కుమార్ అన్నారు.
ఒకవేళ ఆమెను జగిత్యాల నుంచి పోటీ చేయించదలిస్తే అప్పుడు రాష్ట్రంలో జగిత్యాల, హుజూర్నగర్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించవలసివస్తుంది. అదే కనుక జరిగితే కాంగ్రెస్, బిజెపిలు తమ సత్తా చాటుకొనేందుకు మరో అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తాయి.