ఈసారి భారత్ నుంచి ఆస్కార్ అవార్డులకు ఏ సినిమా నామినేట్ అవుతుంది? అంటే ధురందర్, బోర్డర్-2, పెద్ది వంటి పెద్ద సినిమాల పేర్లు వినిపిస్తాయి. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాటన్నిటినీ కాదని మరాఠీ సినిమా ‘గొంధల్’ని భారత్ తరపున ఆస్కార్ అవార్డులకు ఎంపిక చేసి పంపిస్తోంది.
చిన్నా పెద్ద కలిపి మొత్తం 30 సినిమాలు పోటీ పడగా వాటిలో ప్రధమ స్థానంలో గొంధల్, తర్వాత స్థానాలలో ఇక్కీస్, అంఘ్ సినిమాలు నిలిచాయి. మరాఠీ చిత్రం ‘గొంధల్’ను 99వ అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారత అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. .
మహారాష్ట్రలో నేటికీ ‘గొంధల్’ అనే జానపద ప్రదర్శన నేటికీ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో మరాఠీ గ్రామీణ ప్రజల జీవనశైలి, మానవ సంబంధాలు, వారి కష్టసుఖాలు ఈ సినిమాలో అద్భుతంగా చూపారు.
ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాను ప్రదర్శించగా వెండి నెమలి అవార్డు గెలుచుకుంది. భారతీయ గ్రామీణ జీవన శైలిని, సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఉన్నందున ఈ సినిమాను భారత్ తరపున ఆస్కార్ అవార్డు కొరకు ఎంపిక చేసినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు.
మరో విశేషమేమిటంటే, ‘గొంధల్’ దర్శకుడు సంతోష్ దావఖర్కు ఇదే మొదటి సినిమా. అనేక మంది దిగ్గజ దర్శకులతో పోటీ పడి తొలి ప్రయత్నంలోనే భారత్ తరపున ఆస్కార్ నామినేషన్ సాధించడం మామూలు విషయం కానే కాదు. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీన లాస్ ఎంజలీస్లోని డల్బీ థియేటర్లో 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.