ఫార్ములా రేసింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “తమిళనాడు సిఎం విజయ్ రేసింగ్ చూసేందుకు లండన్ వెళ్ళారు. నేను అదే రేసింగ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహింపజేస్తే నాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తప్పుడు కేసు పెట్టి వేధిస్తోంది. కానీ నేను ఏ తప్పు చేయలేదు కనుక నాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. ఈ కేసులో న్యాయపోరాటం చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను,” అని అన్నారు.
కోర్టు ఆదేశం మేరకు కేటీఆర్ స్వయంగా విచారణకు హాజరయ్యారు. కానీ ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా పడటంతో కేటీఆర్ తిరిగి వెళ్ళిపోయారు.
ఎర్రవల్లి భూముల సర్వే మొదలైనందున ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఉద్రిక్తంగా ఉన్నాయి. కనుక ఇప్పుడీ ఫార్ములా రేసింగ్ కేసు విచారణకు కేటీఆర్ హాజరైనప్పుడు ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా, భారీగా పోలీసులను మొహరించి, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు.