క్షుద్ర పూజలు చేసినప్పుడు ఈ భయం లేదా? సీఎం రేవంత్‌

September 16, 2026


img

నేడు అసెంబ్లీలో  22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి సభ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్‌ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “22ఏ గురించి బీఆర్ఎస్‌ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది కనుకనే నేడు అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టి మాట్లాడుతున్నాము. బీఆర్ఎస్‌ నేతలు  మాకు బాధ్యత గుర్తుచేసే పరిస్థితిలో మేము లేము. 

అసెంబ్లీలో వారి హయంలో జరిగిన అవినీతి, అక్రమాలు, ఇంకా పొరుగు రాష్ట్రాలలో హరీష్‌ రావు చేస్తున్న క్షుద్రపూజల గురించి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి ఉంటుందనే భయంతోనే సభలో రభస చేసి సస్పెన్షన్ వేటు వేయించుకొని పారిపోయారు. 

పైగా మాక్ అసెంబ్లీ నిర్వహించి చట్ట సభలను, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్షుద్రపూజలు చేసినప్పుడు కలుగని భయం, దాని గురించి అసెంబ్లీలో ప్రస్తావన వస్తుందంటే భయం దేనికి?ఆ భయంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు ఇలాంటి వికృత చేష్టలు చేయడం దేనికి? 

ఇదివరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు నినాదాలతో కూడిన డ్రస్సులు, ప్లకార్డులతో సభ్యులను అసెంబ్లీకి అనుమతించరాదని నిబంధన పెట్టారు. కానీ దానిని మీ సభ్యులే ఉల్లంఘించి లోనికి ప్రవేశించబోతే పోలీసులు అడ్డుకున్నారు. కానీ అప్పుడు మీరు చేసిన వికృత చేష్టలను తెలంగాణ ప్రజలందరూ కళ్ళారా చూశారు. 

పోలీసులపై దాడి చేశారు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ దొరల అహంకారానికి ఇవన్నీ నిదర్శనం కావా?” అని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 


Related Post