బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు ఇటీవల శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత రాజకీయ దుమారం సృష్టించాయో అందరూ చూశారు.
ఈసారి శాసనసభ సమావేశాలలో రేవంత్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టాలని కేసీఆర్ వ్యూహరచన చేసి పంపిస్తే, అది బెడిసి కొట్టడమే కాక, తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేకి అనే భావన కలిగించేలా చేసింది.
ఇది సరిపోదన్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దళిత నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్హౌసుకు వెళ్ళేదారిలో ‘చావు డప్పు’ కొట్టి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఆయుధం అందిస్తే, వారు తిరిగిన ప్రదేశంలో పసుపు నీళ్ళతో శుద్ధి చేసి కాంగ్రెస్ పార్టీకే ఆ బలమైన అస్త్రాన్ని తిరిగి అందించినట్లయింది.
ఈ పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాతమధు వలన జరిగిన నష్టం పట్ల తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కనుక ఆయనకు ఎమ్మెల్సీగా ఇదే మొదటి చివరి అవకాశం కావచ్చని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.