శనివారం సాయంత్రం చెన్నైలో ‘పెద్ది’ టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది. దీనిలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ, “గౌరవనీయ సిఎం విజయ్ తన సినీ కెరీర్ పీక్లో ఉండగా ప్రజల కోసం దానిని వదులుకొని రాజకీయాలలోకి వచ్చారు.
ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. తన సినిమాలతో అయన ఏవిధంగా మంచి పేరు, ప్రజాధరణ పొందారో అదేవిధంగా రాజకీయాలలో కూడా రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.
టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల మద్య బలమైన సంబంధాలే ఉన్నాయి. కానీ విజయ్ టీవీకే పార్టీ ఏర్పాటు చేసుకొని రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు, విజయ్ నటించిన జన నాయగన్ సినిమాని సెన్సార్ బోర్డు అడ్డుకున్నప్పుడు టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించలేదు.
ఆ తర్వాత టీవీకే పార్టీ ఎన్నికలలో 108 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించకుండా తిప్పలు పెడుతున్నప్పుడు, చివరికి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కోలీవుడ్లో కమల్ హాసన్, రజినీకాంత్, విశాల్ వంటి పలువురు ప్రముఖులు స్పందించారు. కానీ టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించలేదు.
ఏపీ, తెలంగాణ రాజకీయాలకే దూరంగా ఉంటున్న టాలీవుడ్ ప్రముఖులు తమిళనాడు రాజకీయాలలో వేలు పెదతారనుకోలేము. కానీ చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం విజయ్ గురించి రామ్ చరణ్ చాలా ఆచితూచి మాట్లాడుతూ ప్రశంశించారు. మాట తేడా వస్తే తమిళ ప్రేక్షకులు, మీడియా నిర్దాక్షిణ్యంగా ‘పెద్ది’ని శిక్షిస్తారని రామ్ చరణ్కు తెలుసు.