కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలో పలు రాష్ట్రాలను కలుపుతూ హైస్పీడ్ రైల్వే కారిడార్స్ నిర్మించేందుకు సర్వేలు నిర్వహిస్తోంది. వాటిలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ఓ హైస్పీడ్ రైల్వే కారిడార్స్ నిర్మించబోతోంది.
శంషాబాద్ నుంచి భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని వాడపల్లి వరకు ప్రస్తుతం సర్వే జరుగుతోంది. హైస్పీడ్ రైల్వే కారిడార్స్ ప్రధానోద్దేశ్యం తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరుకోవడం కనుక వీలైనంత తక్కువ దూరం ఉండేవిధంగా నిర్మించబోతోంది.
మొదట ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ని 236 కిమీ నిర్మించాలనే ప్రతిపాదనలు చేయగా దానిని సగానికి తగ్గించి అంటే 123 కిమీ పొడవున తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు స్టేషన్లు ఏర్పాటు చేసి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కనుక ప్రస్తుతం దీని సర్వే జరుగుతోంది.
తెలంగాణకు సముద్రతీరం లేదు కనుక నల్గొండ జిల్లాలో డ్రైపోర్టు నిర్మిస్తోంది. అక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి దాని మీదుగా హైస్పీడ్ రైల్వే కారిడార్ని నౌకాశ్రయాలు కలిగిన ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను కలిపినట్లయితే తెలంగాణ నుంచి విదేశాలకు, అదే విధంగా విదేశాల నుంచి తెలంగాణకు ఎగుమతి, దిగుమతులు సులభతరమవుతాయనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు ఈ మార్పులు చేశారు. కనుక ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్లో హైస్పీడ్ రైళ్ళతో పాటు సరుకు రవాణా చేసేందుకు వీలుగా నిర్మించబోతున్నారు.