భారత అంతరిక్ష పరిశోధన రంగంలోకి ప్రైవేట్ సంస్థలను, పెట్టుబడులను అనుమతించిన తర్వాత ఆ రంగంలో ప్రవేశించిన సంస్థలు రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఏరో స్పేస్, రక్షణ రంగాలకు సంబందించిన అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్పేట వద్ద ఏర్పాటు చేసిన అబ్యోమ్ స్పేస్ టెక్ అండ్ డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ కూడా వాటిలో ఒకటి. ఈ సంస్థలో యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ద్రవ ఇందనంతో పనిచేసే రాకెట్ ఇంజన్ తయారుచేశారు.
దీని మరో ప్రత్యేకత ఏమిటంటే సాంప్రదాయ ఇంజన్లకు భిన్నంగా దీనిని మళ్ళీ మళ్ళీ ఉపగ్రహ ప్రయోగాలకు వాడుకోవచ్చు.
శామీర్పేట వద్ద గల కమర్షియల్ టెస్ట్ ఫెసిలిటీ సెంటరులో బుధవారం దేశీయంగా తయారైన ఈ రాకెట్ ఇంజన్ని పరీక్షించగా విజయవంతమైంది. భారత్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయిగా నిలిచిపోయే ఈ ఆవిష్కరణ మన హైదరాబాద్లోనే జరగడం మన అందరికీ గర్వకారణమే కదా?