ప్రొ.నాగేశ్వర్‌కి మద్దతుగా నేడు ప్రెస్‌క్లబ్‌లో సమావేశం

May 27, 2026


img

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొ.నాగేశ్వర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఏపీలో టీడీపి, జనసేనలు భగ్గుమన్నాయి. “ఇటీవల ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి, మాజీ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నారు. 

కానీ ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు మాకు షార్ట్ టర్మ్ స్నేహితుడు కాగా, జగన్మోహన్ రెడ్డి మాకు లాంగ్ టర్మ్ స్నేహితుడు. అరెస్ట్ చేయడం కుదరదు,” అని ఖరాఖండీగా చెప్పారని తనకు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందని ప్రొ.నాగేశ్వర్‌ అన్నారు. 

దీనిపై టీడీపి, జనసేన రెండు పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఆ పార్టీల మద్దతుదారులు ప్రొ.నాగేశ్వర్‌పై పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేశారు. కనుక నేడో రేపో పోలీసులు హైదరాబాద్‌ వచ్చి ఆయనని అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్‌ సైతం ప్రొ.నాగేశ్వర్‌ వ్యాఖ్యలను తప్పు పట్టారు. కానీ అయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, క్షమాపణలు చెప్పుకున్నందున ఇక్కడితో ఈ వ్యవహారం ముగిసిందన్నారు. ఆయనేదో నోరు జారి పొరపాటున ఆవిధంగా మాట్లాడి ఉంటారు కనుక ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించానని పవన్ కళ్యాణ్‌ అన్నారు. 

కానీ సోషల్ మీడియాలో ప్రొ.నాగేశ్వర్‌పై ట్రోలింగ్‌  ఆగడం లేదు. బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. కనుక అయన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ని కలిసి పిర్యాదు చేశారు. 

అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఏపీ పోలీసులు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. నా ఇంటికి ఎవరూ రాలేదు. ఫోన్ చేయలేదు. వాట్సప్ మెసేజ్ కూడా పంపలేదు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లే. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నందునే డీజీపీ సీవీ ఆనంద్‌ని కలిసి పిర్యాదు చేశాను. జనసేన గురించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు కూడా చెప్పాను. కనుక అది ముగిసిన అధ్యాయం,” అని అన్నారు.

కానీ తెలంగాణ క్రాంతి దళ్ ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతోంది. ప్రొ.నాగేశ్వర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి, పోలీసుల కేసులని ఖండించేందుకు సమావేశం నిర్వహించబోతోంది. 


Related Post