కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలోనే ప్రజలకు అబద్దాలు, మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తూనే ఉన్నాయి. వాటి విమర్శలకు బామ్ చేకూర్చుతున్నట్లు నిజామాబాద్లో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం విశేషం.
నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ఈసారి ఎన్నికలలో ఖచ్చితంగా ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డి కేంద్రమంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహ రావుగారు ప్రధానిగా దేశాన్ని పాలించారు.
కనుక మీరు జీవన్ రెడ్డిని గెలిపించుకుంటే నేను సోనియా, రాహుల్ గాంధీల కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా ఒప్పిస్తాను. రాష్ట్రంలో రైతుల సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న జీవన్ రెడ్డి తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు.
అటువంటి వ్యక్తి కేంద్ర వ్యవసాయ మంత్రి అయితే మన రాష్ట్రానికి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా, ఇక్కడి పసుపు రైతులకు ఎంతో మేలు చేస్తారు. కనుక ఈ ఎన్నికలలో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాను,” అని అన్నారు.
ఇప్పటికే ఇండియా కూటమి కప్పల తక్కెడలా మారింది. మిగిలిన పార్టీల మద్య కూడా సఖ్యత లేదు. ఒకవేళ ఉన్నా మోడీ, అమిత్ షాల నాయకత్వంలో దూసుకుపోతున్న బీజేపీని ఢీకొని గెలిచే అవకాశం లేదు. ఒకవేళ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాహుల్ గాంధీని ప్రధాని అంటే కూటమిలో భాగస్వాములు అంగీకరించరు.
ఒకవేళ అంగీకరించినా కేంద్రమంత్రి పదవులు జీవన్ రెడ్డికో మరొకరికో ఇచ్చేస్తామంటే చూస్తూ ఊరుకోవు. కానీ సిఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని గెలిపిస్తే చాలు కేంద్రమంత్రి అయిపోతారన్నట్లు మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది కదా?