బుధ, గురువారాలలో రాజధాని హైదరాబాద్తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాలలో కుండపోతగా వాన మొదలైంది. సాయంత్రానికి అది మరింత పెరిగే అవకాశం ఉంది.
కనుక ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచే ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ళకు పంపించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. భారీ వర్షం కారణంగా నగరంలో రోడ్లపై నీళ్ళు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కనుక కాస్త ముందుగా ఉద్యోగులను లాగ్ అవుట్ చేయించి భద్రంగా ఇళ్ళు చేరుకునేందుకు సహకరించాల్సిందిగా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో రాబోయే రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. కనుక వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో, మరికొన్నిటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.