సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన పిట్టల దొర కేసీఆర్కు మళ్ళీ ఒంట్లో కాస్త ఓపిక వచ్చిన్నట్లుంది. అందుకే మళ్ళీ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నాడు.
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారంటూ కేసీఆర్ చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అని మరిచిపోతున్నాడు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నేనే కాపాడుకొంటున్నాను. కనుక ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం లేదు. అయినా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని ప్రయత్నిస్తే మాడి మసైపోతాడు.
పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చేశావు. పదేళ్ళలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి కనీసం జాతీయ హోదా సాధించలేనప్పుడు బిఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి? వెళ్ళి పార్లమెంటులో నిద్రపోవడానికా?
దేశానికి, రాష్ట్రానికి మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు, వాటి నేతలకు ఎప్పుడూ అధికారం, ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తుంటాయి తప్ప ప్రజల గురించి ఆలోచించవు. ఆలోచించి ఉండి ఉంటే నేడు మహబూబ్ నగర్ జిల్లా ఈ దుస్థితిలో ఉండేదే కాదు,” అని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
అయితే రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోతారనే కేసీఆర్ ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా బిఆర్ఎస్ నేతలందరూ ఇదే పాట పాడుతున్నారు. అయినా రేవంత్ రెడ్డి ఈ ఆరోపణకు ఇంతవరకు సమాధానం చెప్పకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.