నిన్న తెలంగాణ భవన్లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మన పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినవారు ఆ పార్టీలో ఇమడలేక తిరిగి వచ్చేస్తామంటున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన పార్టీలో వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. తీసుకు రమ్మంటారా సార్? అని మన పార్టీలో ఓ సీనియర్ నాయకుడు నన్ను అడిగితే అప్పుడే వద్దని చెప్పాను.
116 సీట్లతో చాలా బలంగా ఉన్న మన ప్రభుత్వాన్నే కూల్చేసేందుకు ఆనాడు ప్రయత్నించిన బీజేపీ 65 మంది ఎమ్మెల్యేల బొటాబోటి మెజార్టీతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా విడిచిపెడుతుందా? ఉండదు. కనుక లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మద్య జరిగే పోరు వలన తెలంగాణలో పెను రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోంది.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోయేందుకు వెనకాడకపోవచ్చు. కానీ ఆయన వెంట బీజేపీలోకి వెళ్ళడానికి ఇష్టపడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన పార్టీనే ఆశ్రయించే అవకాశం ఉంది. కనుక భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదే.
లోక్సభ ఎన్నికలలో అందరం కలిసికట్టుగా పోరాడి ఎక్కువ సీట్లు సాధించుకోవడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ మార్పు ప్రారంభం అవుతుంది. రాగల రోజులలో మీరందరూ తెలంగాణ ఉద్యమకాలం నాటి కేసీఆర్ని చూడబోతున్నారు,” అని అన్నారు.