వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్ధి విషయంలో అనేక నాటకీయ పరిణామాల తర్వాత డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ని పార్టీ అభ్యర్ధిగా కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండకు చెందిన ఆయన మొదటి నుంచి కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు.
ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడు, పార్టీకి విధేయంగా ఉంటూనే పదవుల కోసం ఏనాడూ పట్టుబట్టక పోవడం, అందరితో కలుపుగోలుగా ఉండటం వంటివి ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చాయి.
జిల్లా బిఆర్ఎస్ నేతలందరి ఏకాభిప్రాయంతో కేసీఆర్ ఆయనను వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు.
వరంగల్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి కుమార్తె పోటీ చేయవలసి ఉండగా ఆమె తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ అభ్యర్ధిగా వరంగల్ నుంచే పోటీ చేస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయిన ఆరూరి రమేష్ వరంగల్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు.
అంటే వరంగల్లో ఒకే పార్టీకి చెందిన ముగ్గురూ పోటీ పడబోతున్నారన్న మాట!