గమనిక: నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: ఆరూరి రమేష్

March 13, 2024


img

బిఆర్ఎస్ సీనియర్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నేను మా పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఇక్కడకు వచ్చాను. అయినా నన్ను నా సొంత పార్టీ నేతలు ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అని ప్రశ్నించారు. 

పార్టీ మారడం గురించి మాట్లాడుతూ, “నేను బీజేపీ నేతలను కలిశాను కానీ పార్టీ మారేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశానని వస్తున్న వార్తలలో నిజం లేదు. నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఎప్పటికీ ఉంటాను,” అని ఆరూరి రమేష్ చెప్పారు.   

బుధవారం ఉదయం ఆయన హన్మకొండలోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమైన తర్వాత బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

దానిలో మాట్లాడబోతుంటే హటాత్తుగా బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు హడావుడిగా వచ్చి ఆయనతో కాసేపు మాట్లాడి కారులో వెంట పెట్టుకువెళ్ళిపోయారు.

దీంతో ఆయన కుమారుడు, అనుచరులు బిఆర్ఎస్‌ నేతలు ఆరూరి రమేష్‌ని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రమేష్ ఈ కిడ్నాప్, పార్టీ మరే కధలని సుఖాంతం చేసి ముగించారు. కానీ బిఆర్ఎస్‌ పార్టీని అంటిపెట్టుకునే ఉంటారా లేదో చూడాలి. 


Related Post