ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచంలో అత్యంత ద్వేషించే వ్యక్తి ఎవరు అంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడని ఎవరైనా టక్కున చెపుతారు. ఆయనపై అనేక కేసులు నమోదు చేసి జైలుకి పంపించారు కూడా. కానీ ఆయన బెయిల్పై బయటకు వచ్చేశారు. ఇదో అసంతృప్తి అనుకుంటే, ఇప్పుడు వైఎస్ షర్మిల కొడుకు పెళ్ళి పత్రిక పట్టుకుని ఆయన ఇంటికే వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోవడం కష్టమే.
శనివారం ఉదయం ఆమె హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కొడుకు రాజారెడ్డి పెళ్ళికి రావలసిందిగా ఆహ్వానించారు. ఆమె బయట మీడియాతో మాట్లాడుతూ, “మా నాన్నగారు తన ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళకు కూడా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. ఆయన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు.
చంద్రబాబు నాయుడుతో మాకు రాజకీయంగా ఎటువంటి సంబందమూ లేదు కానీ మా కుటుంబాల మద్య మంచి అనుబంధం ఉంది. అందుకే ఆయనను మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానించాను.
ఇదేమీ పెద్ద విచిత్రం, విడ్డూరం కాదు. ఇది జస్ట్ ఫ్రెండ్లీ రాజకీయాలు మాత్రమే. రాజకీయాలలో ఇటువంటి స్నేహపూరిత వాతావరణం అవసరం.
కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ ఏ బాధ్యతలు అప్పగిస్తే అది చేస్తానని ఇంతకు ముందూ చెప్పాను. ఇప్పుడూ చెపుతున్నాను. రాజకీయాలు ఇలా ఉండాలని కానీ ఉండకూడదని గానీ నేను చెప్పడం లేదు. కానీ రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ప్రజల కోసమే పనిచేయాలని నేను గట్టిగా నమ్ముతాను,” అని అన్నారు.
ఒకప్పుడు నేను జగనన్న సంధించిన బాణాన్ని అని గర్వంగా చెప్పుకుంటూ వైఎస్ షర్మిల పాదయాత్రలు చేసారు. ఇప్పుడు అదే బాణం జగనన్న గుండెల్లో గుచ్చుకోబోతుండటం విశేషమే కదా?