రేపు సాయంత్రం ఈ సమయానికి దాదాపు పోలింగ్ ముగింపు దశకు చేరుకొంటుంది. అంటే ఓటర్ల తీర్పు ఈవీఎం మెషిన్లలోకి వచ్చేస్తుందన్న మాట. కనుక మూడు ప్రధాన పార్టీల నేతలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈసారి ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. కనుక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్చార్జి మాణిక్రావ్ ఠాకూర్, మధు యాష్కీ, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని బిర్లా మందిర్లో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారందరూ తమ పార్టీ మ్యానిఫెస్టోని స్వామివారి పాదాల చెంత, దర్గాలో ఉంచి, తమ పార్టీ అధికారంలోకి రాగానే తొలి మంత్రి వర్గ సమావేశంలోనే మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీ పధకాలకు చట్టబద్దత కల్పించేందుకు తగిన నిర్ణయం తీసుకొంటామని ప్రమాణాలు చేశారు.
రేపు పోలింగ్ జరుగబోతున్నందున దీంతో ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు చేస్తున్న మరో ప్రయత్నంగానే భావించవచ్చు. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరబోమని,ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుకోమని వారు ముందుగా ప్రమాణం చేసి ఉంటే బాగుండేదేమో?