తెలంగాణ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రచారం ఎంతగా ప్రభావం చూపుతోందో, సోషల్ మీడియా కూడా అంతే ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య నిశబ్ధంగా సాగుతున్న ప్రచారం, ఎదురుదాడులు, వాటి వ్యూహాలను చూస్తుంటే, ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
తాజాగా సోషల్ మీడియాలో మూడు విషయాలు బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
1. మొదట్లో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వేలన్నీ ఇప్పుడు క్రమంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెపుతుండటం.
2. ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదని ఇంటలిజన్స్ నివేదికలతో అప్రమత్తమైన సిఎం కేసీఆర్, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ని ఈ నెల 20న ప్రగతి భవన్కు రప్పించుకొని చర్చించారనే వార్తలు. బిఆర్ఎస్ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, నష్టనివారణ చర్యలు చేపట్టడానికి సమయం మించిపోయిందని, కనుక డిసెంబర్ 30వ తేదీలోగా ఏమేమీ చేయగలరో అవి చేసుకొని కనీసం గౌరవ ప్రదమైన స్థానాలు గెలుచుకొనేందుకు ప్రయత్నించమని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చిన్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు మీడియాలోకి వచ్చేస్తుండటం.
3. సిరిసిల్లా బిఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్లు, సర్పంచులు ‘ఈసారి బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఓడిపోతారట కదా?’అంటూ మాట్లాడుతున్న మాటలు పార్టీకి, తనకు చాలా నష్టం కలిగిస్తాయని, కనుక దయచేసి మన పార్టీని మనమే ఓడించుకోవద్దని, ఈ వారం రోజులూ ప్రతీ ఒక్కరూ సిరిసిల్లాలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేయాలని, ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారితో తానే వచ్చి మాట్లాడుతున్నానని నచ్చజెప్పి అందరూ మనకే ఓట్లు పడేలా చేయాలంటూ సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ఫోన్ సంభాషణ లీక్ అవడం.
ఈ మూడూ కూడా ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించేవే అని అర్దమవుతోంది. కనుక ఇవి నిజమా లేక కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యూహకర్తలు అమలుచేస్తున్న యుద్ధ తంత్రమా?అనేది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలే చెప్పాలి.