తెలంగాణలో ఎదురే లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే. అటువంటి గొప్ప నాయకుడు ఈసారి ఎన్నికలలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీకి దిగడంతో కేసీఆర్ తొలిసారిగా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అందుకు ఆయన, బిఆర్ఎస్ నేతలు వేరే కారణాలు చెప్పుకొన్నప్పటికీ, ఈటల రాజేందర్ కారణంగానే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీకి సిద్దపడ్డారని అందరికీ తెలుసు.
ఈటల రాజేందర్ను తప్పించుకొన్నారంటే, ఇప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన తుది జాబితాలో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతునట్లు స్పష్టమైంది.
ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే. హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఈటల రాజేందర్ బిఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించి కేసీఆర్కు ఖంగు తినిపించారు.
రెండు ఎన్నికలలో వరుసగా ఓడిపోయి, ఫిరాయింపులతో పూర్తిగా బలహీనపడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నిలబెట్టడం సామాన్యమైన విషయమేమీ కాదు. కానీ రేవంత్ రెడ్డి చేసి చూపించారు. కనుక ఆయన కూడా కామారెడ్డిలో కేసీఆర్కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమే.