తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు, వారి బలిదానాలను గుర్తు చేసుకొనేందుకు గన్పార్కులో ఏర్పాటు చేసిన స్థూపం, రాజకీయ పార్టీలకు, వాటి రాజకీయాలకు సాక్ష్యంగా నిలబడాల్సి వస్తుండటం చాలా బాధాకరం.
శాసనసభ ఎన్నికలలో ఓటర్లకు డబ్బు, మద్యం పంచకుండా నిజాయితీగా పోటీ చేస్తానని ప్రమాణం చేసేందుకు అమరవీరుల స్థూపం వద్దకు రావలసిందిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎం కేసీఆర్కు సవాలు విసిరారు. అయితే రేవంత్ రెడ్డికి అక్కడకు వెళ్ళేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అదుపులో తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
దీనిపై తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ, “తోక ముడిచిన కేసీఆర్... మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికలలో పాల్గొనే ధైర్యం కేసీఆర్కు లేదని తేలిపోయిందని” ట్వీట్ చేసింది.
బిఆర్ఎస్ కూడా వెంటనే స్పందిస్తూ, “ తెలంగాణ తొలిదశ ఉద్యమలాలోనే 369 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపించింది. కాంగ్రెస్ దాష్టీకానికి ఆ పవిత్ర స్థూపమే సాక్షి. దానిని తాకే అర్హత ఏ కాంగ్రెస్ నాయకుడికి లేదు,” అని ట్వీట్ చేసింది.