తెలంగాణ సిఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను సచివాలయానికి ఆహ్వానించి మర్యాదలు చేయడంతో వారి మద్య విభేధాలు ఇక సమసిపోయిన్నట్లే అని అందరికీ అనిపించింది. కానీ కేసీఆర్ ఏవిదంగా ఆమె పట్ల ఎప్పటికప్పుడు అనూహ్యంగా తన వ్యవహార శైలి మార్చుకొంటున్నారో, ఆమె కూడా అదేవిదంగా చేస్తూ షాక్ ఇచ్చారు.
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు రాష్ట్ర మంత్రివర్గం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది. అయితే గవర్నర్ కోటాలో వారిని నామినేట్ చేయలేమని రాజ్భవన్ స్పష్టం చేసింది. గవర్నర్ కోటాలో ఆ పదవులకు నామినేట్ చేసేందుకు వారు తగినవారుకారని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారికి రాజ్భవన్ ఓ లేఖ ద్వారా తెలియజేసింది.
ఇదివరకు పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో నామినేట్ చేసేందుకు తిరస్కరించినప్పుడే తమిళిసై సౌందర్ రాజన్ నామినేటడ్ పదవుల విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి, గవర్నర్ను దూరం పెట్టారు. అయితే కేసీఆర్ ఆమెను సచివాలయానికి ఆహ్వానించి మర్యాదలు చేసినంత మాత్రన్న బుట్టలో పడిపోనని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఈవిదంగా తెలియజేసిన్నట్లయింది. దీంతో రాజ్భవన్, ప్రభుత్వం మద్య మళ్ళీ యుద్ధవాతావరణం ఏర్పడింది. ఇది ఇక ముగిసేది కూడా కాదు.