పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలవగానే మోడీ ప్రభుత్వం హటాత్తుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లు కోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
ఇటీవలే సిఎం కేసీఆర్ దీనికోసం ప్రధాని మోడీకీ ఓ లేఖ కూడా వ్రాశారు. కనుక ఈ బిల్లుని కేంద్రం ఆమోదించిందని తెలియగానే దాని కోసం పోరాడుతున్న కల్వకుంట్ల కవిత స్వాగతించారు. మోడీకి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
అయితే ఇప్పటికిప్పుడు ఈ బిల్లుని ఆమోదించి అమలుచేస్తే తమ పరిస్థితి ఏమిటని బిఆర్ఎస్ అభ్యర్ధులతో సహా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు ఆందోళన చెందారు.
కానీ ఈ బిల్లుని 2024లో జనగణన పూర్తి చేసి నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాతే అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొంది. దీంతో అన్నీ పార్టీలకు ఊరట లభించింది. ముఖ్యంగా తెలంగాణలో బిఆర్ఎస్ అభ్యర్ధులకు చాలా ఊరట లభించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కొద్ది సేపటి క్రితం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.