స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వారు నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న సోమవారంనాడు ఆ భవనంలో చివరిసారిగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. దానికి సమీపంలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నేటి నుంచి సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ భవనానికి ‘ది పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా’గా నామకరణం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ గెజిట్ నోటిఫికేషన్ నిన్న విడుదల చేసింది.
భవిష్యత్లో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరిగినా సరిపోయేలా సకల ఆధునిక సౌకర్యాలు, భద్రతా వ్యవస్థతో ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. నేడు ఈ నూతన పార్లమెంట్ భవనంలో జరుగబోయే తొలి సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయాలలో ఉన్న మహిళలకు గొప్ప వరం అనే చెప్పవచ్చు. ఈ చట్టం అమలులోకి వస్తే ఇక నుంచి జరుగబోయే లోక్సభ, శాసనసభ, మండలి ఎన్నికలలో మహిళలకు తప్పనిసరిగా 33 శాతం సీట్లు కేటాయించవలసి ఉంటుంది. త్వరలోనే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ తర్వాత వెంటనే లోక్సభ, మరో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాలిస్తే అన్ని రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం పడబోతోంది.