తెలంగాణ శాసనసభ ఎన్నికలు వాయిదా పడవచ్చని మంత్రి కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో గందరగోళం నెలకొంది. అయితే షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగబోతుననాయని సూచిస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ అధికారులు వచ్చే నెల 3నుంచి 5వరకు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
అక్టోబర్ 3న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు గుర్తింపు గల అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎన్నికల నిర్వహణ గురించి చర్చిస్తారు. తర్వాత సాయంత్రం 6.30 గంటల వరకు ఎన్నికల నిర్వహణలో పాల్గొనబోయే అధికారులతో సమావేశమవుతారు. తర్వాత నోడల్ అధికారులతో సమావేశమవుతారు.
మర్నాడు ఉదయం 9.15 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 33 జిల్లాలకు చెందిన డీఈవో, ఎస్పీ, పోలీస్ కమీషనర్లతో సమావేశమవుతారు.
మర్నాడు అంటే అక్టోబర్ 5న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సీఎస్, డిజిపిలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ప్రెస్మీట్ నిర్వహిస్తారు. వారు ఢిల్లీ తిరిగి వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజులలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.