నేడు (సెప్టెంబర్ 17) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేసి, సైనిక వందనం స్వీకరించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పటిలాగే కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ విమోచన దినోత్సవం జరపనందుకు విమర్శలు గుప్పించారు. మజ్లీస్ పార్టీకి భయపడి కేసీఆర్ తెలంగాణ చరిత్రని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేతో యావత్ కాంగ్రెస్ నేతలు కూడా త్రివర్ణ పతాకం ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపగా బిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం కూడా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ‘జాతీయ సమైక్య దినోత్సవం’ వేడుకలు నిర్వహించింది. సిఎం కేసీఆర్ హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జెండా ఎగురవేసి సమైక్య దినోత్సవం వేడుకలలో పాల్గొన్నారు. మజ్లీస్ పార్టీ కూడా త్రివర్ణ పతాకం ఎగురవేసి సమైక్య దినోత్సవం వేడుకలు నిర్వహించింది. ఇంతకీ ఇది విమోచనా? సమైక్యమా?