మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా 28 పార్టీలతో కూడిన ఇండియా కూటమి నేడు రెండో రోజు ముంబయిలో సమావేశమయ్యింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సమాజ్వాదీ, ఆమాద్మీ, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, డీఎంకె, శివసేన, పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల అధినేతలు లేదా వాటి ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
• అత్యున్నత విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు 14 మందితో ఓ అత్యున్నతస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు.
• ఈ కమిటీ నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.
• ఈ నెలాఖరులోగా కూటమిలో భాగస్వామి పార్టీలన్నీ సీట్లసర్దుబాట్లు చేసుకోవాలి.
• ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల మద్యకు వెళ్ళాలి.
• భారత్ జుడేగా… ఇండియా జితేగా (భారత్ ఏకీకరణ జరుగుతుంది... ఇండియా కూటమి, భారతదేశం గెలుస్తుంది) అనే నినాదాన్ని స్థానిక భాషలలో అనువదించి దాంతో ఉదృతంగా ప్రజల మద్యకు వెళ్ళాలి.
అయితే ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో ముందుగా ప్రకటించి, దానికి అన్నీ కట్టుబడి ఉంటేనే దానిపై దేశప్రజలకు నమ్మకం కలుగుతుంది. కానీ ప్రధాని అభ్యర్ధిని ప్రకటించగానే దానిని ఆశిస్తున్న పార్టీల మద్య పోటీ మొదలవుతుంది. అది కూటమి విచ్ఛిన్నానికి దారి తీస్తుంది.
అంతేకాదు... ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తే మోడీ ప్రభుత్వం వారిని టార్గెట్ చేసుకొని ఎదురుదాడులు మొదలుపెడుతుంది. కనుక మోడీ ప్రభుత్వం ధాటిని తట్టుకొంటూ, కూటమికి బలమైన నాయకత్వం అందించగల ప్రధాని అభ్యర్ధిని ప్రకటించగలిగితేనే వాటి ఐఖ్యతను, వాటి సామర్ధ్యాన్ని దేశ ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ 'ఇండియా'లో ఇది సాధ్యమా? ఏమో వారికే తెలియాలి.