రైలు ప్రమాదం గురించి వారం రోజుల క్రితమే ఆకాశరామన్న ఉత్తరం!

July 07, 2023


img

ఈరోజు ఉదయం హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నపుడు హటాత్తుగా మంటలు ఎగిసిపడి ఆరు బోగీలు తగలబడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వెంటనే రైలు నిలిపివేయడంతో ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 

ఇది చాలా ఊరట కలిగించే విషయమే అయినా ఇప్పుడు మరో విషయం కలకలం సృష్టిస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఓ అజ్ఞాతవ్యక్తి నించి సికింద్రాబాద్‌ డివిజనల్ రైల్వే మేనేజరుకి ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. 

దానిలో ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం వంటి మరో ప్రమాదం హైదరాబాద్‌-ఢిల్లీ-హైదరాబాద్‌ మార్గంలో మరో వారం రోజులలో జరుగబోతోందనే రహస్య సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాని ఆ అజ్ఞాతవ్యక్తి ఇంగ్లీషులో వ్రాశాడు. 

అయితే ఆ లేఖను ఎవరో ఆకతాయి పని అని భావించి రైల్వే అధికారులు పట్టించుకోలేదు. అతను చెప్పిన్నట్లుగా ఢిల్లీ-హైదరాబాద్‌ రైల్లో కాకపోయినా హౌరా-హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణించే రైలులోనే సరిగ్గా వారం రోజుల తర్వాతే ఈ అగ్నిప్రమాదం జరిగింది. 

దీంతో ఇప్పుడు ఆ లేఖ వ్రాసిన అజ్ఞాతవ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఏదో ఆకతాయితనంతో ఆ లేఖ వ్రాస్తే యాదృచ్ఛికంగా అది నిజమైందా లేక అతనికి నిజంగానే సమాచారం లభించి ఈ లేఖ ద్వారా ముందే హెచ్చరించాడా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మొదట రైల్వే సిబ్బంది లోకో పైలట్‌ని హెచ్చరిస్తే రైలు నిలిపిన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఫలక్‌నుమా ప్రయాణికులలో ఓ వ్యక్తి చెయిన్ లాగి ట్రెయిన్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిన్నట్లు రైల్వే అధికారులు ధృవీకరించారు. 

ఈ అగ్నిప్రమాదానికి ఓ ప్రయాణికుడు సిగరెట్ కాల్చడమా లేక విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ జరగడం వలనా లేక నిజంగా ఎవరైనా ఈ కుట్రకు పాల్పడ్డారా?అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది. 

        


Related Post