దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీలో మళ్ళీ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఆయన స్థానంలో కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్న సమయంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కానా? నాకెందుకు అవకాశం ఇవ్వరని రఘునందన్ రావు ప్రశ్నించడం గమనిస్తే, అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లే భావించవచ్చు.
మీడియా ఎదుటకు వచ్చి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నందున ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకోక తప్పని పరిస్థితి కల్పించారని చెప్పావచ్చు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొని ఈవిదంగా మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. లేదా ఆయనకు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో తన మనసులో బాధను వారిలో చెవిన వేసేందుకు వేరే దారిలేక ఈవిదంగా మాట్లాడుతున్నారనుకోవచ్చు.
ఆయన ఏ కారణంతో మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడినప్పటికీ, బిజెపిలో ఆయన కధ క్లైమాక్స్కు వచ్చేసిందని చెప్పొచ్చు. కనుక రఘునందన్ రావుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొంటుందా లేక ఆయన కొరిన్నట్లు ఏదో ఓ పదవి ఇచ్చి బుజ్జగిస్తుందా లేదా ఆయనే పార్టీని ఇబ్బంది పెడుతూ సస్పెన్షన్ వేటు వేయించుకొని బయటకు రాబోతున్నారా? అనేది త్వరలోనే అందరూ చూస్తారు.