తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా ఓ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి మాట్లాడారు. వాటిలో తెలంగాణ అభివృద్ధి, కాంగ్రెస్, బిజెపిల రాజకీయాలు, కేసీఆర్ జాతీయ రాజకీయాలు అనేక అంశాలపై వివరంగా తన అభిప్రాయాలను చెప్పారు. వాటిలో ముఖ్యాంశాలు:
• బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపేసినవారిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న కాంగ్రెస్, బిజెపిలతో మేము కుమ్మక్కు కావలసిన అవసరం మాకేమిటి? దేశాన్ని సర్వనాశనం చేసిన ఆ రెండు పార్టీలతో మేము ఎన్నటికీ చేతులు కలపము. వాటికి బీ-టీమ్గా ఉండాల్సిన అగత్యం మాకు లేదు.
• నిజానికి కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండాలని, దానికి రాహుల్ గాంధీ వంటి అసమర్ధుడు నాయకుడుగా ఉండాలని బిజెపియే కోరుకొంటోంది. కేసీఆర్ వంటి బలమైన, సమర్ధుడైన నాయకుడు ఉంటే ప్రశ్నిస్తారని బిజెపి భయపడుతోంది.
• బిఎస్ నేతలపై ఈడీ, ఐటి దాడులు జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటి దాడులు ఎందుకు జరగడం లేదు? నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై కోర్టులు చర్యలు తీసుకోకుండా ఆపింది ఎవరు?ఎందుకు?
• ఈడీ, మోడీ, బోడీ ఎవరొచ్చినా మేము సిద్దం. ఎదుర్కొంటాము. కల్వకుంట్ల కవిత విషయంలో మేము వెనక్కు తగ్గేదేలే.
• ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్లో ఓ సభలో కేసీఆర్ గురించి మాట్లాడటమే ఆయన దేశ రాజకీయాలపై చాలా ప్రభావం చూపుతున్నారని అంగీకరించిన్నట్లు భావిస్తున్నాము.
• ఆదానీకి ఇంకా లాభం చేకూర్చాలంటే బిజెపికి ఓట్లు వేయాలి. రాష్ట్రభివృధ్ది కోరుకొంటే బిఆర్ఎస్కు ఓట్లేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
• తెలంగాణను అన్ని విదాల అభివృద్ధి చేసి చూపిస్తున్న కేసీఆర్ని ప్రజలు ఎందుకు వద్దనుకొంటారు?తెలంగాణని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న బిజెపికి ఎందుకు ఓట్లు వేయాలి?
• దేశంలో తెలంగాణలా ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన రాష్ట్రం ఒక్కటైనా ఉందా?చూపిస్తే రాజీనామా చేస్తాను.
• మా అజెండా అభివృద్ధి. మా ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్, బిజెపిల అజెండా ఏమిటి? ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఎవరు?చెప్పాలి.