నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. దానిలో రేవంత్ రెడ్డి సమైక్య రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, ఆకలితో చావనైనా చస్తాం కానీ ఇకపై ఈ అవమానాలను, ఆధిపత్యాన్ని భరించలేమని అన్నారు. తెలంగాణ ఏవిదంగా దోపిడీకి గురవుతోందో ఆవేశంగా వివరిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితులను కళ్ళకు కట్టిన్నట్లు వివరిస్తూ ఆంధ్రా పాలకులు తెలంగాణను సీమాంధ్రాకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరమని అందుకే ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు.
అనాడూ ఆయన టిడిపిలో ఉన్నారు. సభలో డిప్యూటీ స్పీకర్గా మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ వీడియో తెలంగాణ సాధన కోసం రేవంత్ రెడ్డి చేసిన పోరాటాలకు మంచి నిదర్శనమే. అయితే అప్పుడు ఆయన ఏ కాంగ్రెస్ పార్టీని, పాలకులను విమర్శించారో ఇప్పుడు ఆ పార్టీకే అధ్యక్షుడుగా ఉన్నారు.
అప్పుడు ఆయన ఎవరిపై పోరాటం చేశారో వారందరూ నేడు ఆయన పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఆయనే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అంటూ కీర్తిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి ఆ తల్లి రుణం తీర్చుకోవాలని కోరుతున్నారు.
ఆనాడు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఎవరితోనైతే పోరాడారో నేడు వారి కోసమే పనిచేస్తుండటం విచిత్రమే కదా? ఏది ఏమైనప్పటికీ ఆనాడు తెలంగాణ సాధన కోసం రేవంత్ రెడ్డి ఎంతగా తపించుపోయారో ఈ వీడియో కళ్ళకు కట్టిన్నట్లు చూపుతోంది.