వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అమెరికాకు చెందిన మెడ్ట్రానిక్స్ సంస్థ హైదరాబాద్లో రూ.3,000 కోట్ల పెట్టుబ్డితో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటరును ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అమెరికాలో ఆ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశం ఫలించిందని, వారు హైదరాబాద్లో తమ పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధానాలు అద్భుతంగా ఉన్నాయని గ్రహించేందుకు ఇదే మరో గొప్ప నిదర్శనమని కేటీఆర్ ట్వీట్ చేశారు. మెడ్ట్రానిక్స్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
కేటీఆర్ బృందం అమెరికాలో దిగిన మొదటిరోజునే ప్రపంచవ్యాప్తంగా సినీ, మీడియా రంగాలలో పేరు మోసిన ‘వార్నర్ బ్రదర్స్-డిస్కవరీ’ సంస్థ ఆర్థిక విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్తో సమావేశమయ్యి, హైదరాబాద్లో ఆ సంస్థ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ)ని ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. కేటీఆర్ బృందం అమెరికా పర్యటనలో మరిన్ని అమెరికన్ కంపెనీలు, పెట్టుబడులు సాధించడం ఖాయమే.