కర్ణాటకలో దాదాపు మూడు నెలలుగా కాంగ్రెస్, బిజెపి, జేడీఎస్ పార్టీల మద్య ఎన్నికల యుద్ధం నేడు పోలింగ్తో ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 65.69% పోలింగ్ నమోదైన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ముగియడంతో వివిద సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఈసారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఇదివరకు చెప్పినప్పటికీ, పోలింగ్ జరిగిన తీరుని పరిగణనలోకి తీసుకొన్నాక కాంగ్రెస్, బిజెపిలకు ఇంచుమించు సరిసమానంగా సీట్లు రావచ్చని తేల్చి చెప్పాయి. కనుక ఇప్పుడు జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఏర్పడుతోంది. దేవగౌడ, కుమారస్వామిల నేతృత్వంలో గెలుపుకోసం వీరోచితంగా పోరాడినప్పటికీ ఆ పార్టీకి 20-30 సీట్లు మాత్రమే రావచ్చని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా కాపాడుకోగలిగితే కింగ్ మేకర్ అవుతుంది లేకుంటే తీవ్రంగా నష్టపోతుంది.