తెలంగాణ పోలీసులపై చెయ్యి చేసుకొన్నందుకుగాను 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్పై చంచల్గూడ జైలుకి వెళ్ళిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు 24 గంటలు గడువక ముందే బెయిల్ లభించింది. మరికొద్ది సేపటిలో ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు.
నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేలతో ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని, కోర్టు అనుమతి లేనిదే విదేశాలకు వెళ్ళరాదని, ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీనిపై ఆమె తల్లి విజయమ్మ, వారి పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవిదంగా చూస్తే వైఎస్ షర్మిల కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని చెప్పవచ్చు. అదే... వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై రోజుల తరబడి విచారణ జరిగిన్నట్లయితే ఆమె పేరు మీడియాలో వినిపిస్తుండేది. కానీ 24 గంటలలోపే బెయిల్పై బయటకు వస్తుండటంతో ఉచిత పబ్లిసిటీ అవకాశంలేకుండా పోవడమే కాకుండా, బిఆర్ఎస్ పార్టీకి ఆమెకు మద్య రహస్య అవగాహన ఉన్నందునే రెండు పార్టీలు కలిసి ఈ డ్రామా ఆడాయని, అందుకే ఆమె ఇంత త్వరగా బయటకు రాగలిగారని కాంగ్రెస్, బిజెపిలు ఆరోపించే అవకాశం కూడా ఉంటుంది.