తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు మధ్యాహ్నం ఉభయసభల సభ్యులని ఉద్దేశ్యించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని ఆమె యధాతధంగా చదివారు. సిఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందంటూ ప్రశంసించారు. రాజ్భవన్-రాష్ట్ర ప్రభుత్వం మద్య సరైన అవగాహన, సయోధ్య ఉండి ఉంటే ఇది చాలా సాధారణమైన విషయంగానే ఉండేది. కానీ గత ఏడాదిన్నరగా పరస్పరం విమర్శించుకొంటూ, కత్తులు దూసుకొంటున్నందున, ఇప్పుడు అందుకు భిన్నంగా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
అయితే ఈ ప్రసంగం పాఠం తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చుకొన్న ‘సెల్ఫ్ సర్టిఫికేట్’ మాత్రమే. దానినే గవర్నర్ యధాతధంగా చదివారు కనుక దానిలో ఆమె చెప్పిన విషయాలని ఆమె సొంత అభిప్రాయాలుగా పరిగణించలేము. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతానికి గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం మద్య రాజీ కుదిరి మళ్ళీ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది కనుక రాష్ట్ర ప్రభుత్వం దానిని ఇలాగే కొనసాగించగలిగితే చాలా మంచిది. మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.