ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో, పార్టీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చక్రం తిప్పుతున్నారనే సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన “ఓ 20-25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చితే వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా 100 సీట్లు గెలుచుకొంటుంది. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదు,” అని అన్నారు. అవి మీడియాలో ప్రధానంగా రావడంతో ఎర్రబెల్లి మాటమార్చి “నేను అలా అనలేదు. మీడియా నా మాటలని వక్రీకరించిందని” సవరణ ప్రకటన చేశారు.
అయితే కేసీఆర్ సూచన లేదా అనుమతి లేకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటే చేయరు కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 20-25 మందిని మార్చబోతున్నట్లు కేసీఆర్ ఆయన చేత ఈవిదంగా చెప్పించి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటే, ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎదురుచూస్తున్నవారు ఆనందంతో పొంగిపోతున్నారు.
ఇక మరో వాదన కూడా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో బిజెపి నుంచి గట్టి పోటీ ఉంటుంది కనుక బిఆర్ఎస్కి ఎదురీత తప్పదు కనుక గెలిస్తే చాలా తక్కువ మెజార్టీతో గెలుస్తుందని ఎర్రబెల్లి ఉద్దేశ్యం కావచ్చనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎర్రబెల్లి రాజేసిన ఈ నిప్పు మెల్లగా రాజుకొంటున్నట్లే ఉంది.