ప్రధాని నరేంద్రమోడీ ఫిభ్రవరి 13న హైదరాబాద్కి రాబోతున్నారు. జనవరి 19వ తేదీనే ఆయన హైదరాబాద్ రావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. దాంతో ఈనెల 15న ఢిల్లీ నుంచే జెండా ఊపి సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రారంభించేశారు. వచ్చే నెల 13వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తారు. తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగసభలో పాల్గొంటారు.
అంతకంటే ముందు నేటి నుంచి వరుసగా కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. కేంద్ర మంత్రి బిఎల్ వర్మ శనివారం వరంగల్, మహబూబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నుంచి బుదవారం వరకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మెదక్ లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈనెల 23,24 తేదీలలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈనెల 28వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించవలసి ఉంది. కానీ పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఫిభ్రవరి 13న ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఆయన కూడా హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినా వారు కేసీఆర్ ప్రభుత్వంపై, బిఆర్ఎస్ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులపై విమర్శలు గుప్పించడం పరిపాటిగా మారిపోయింది. కనుక మళ్ళీ నేటి నుంచి బిఆర్ఎస్, బిజెపి నేతల మద్య మాటలు, పోస్టర్ యుద్ధాలు ప్రారంభం కావచ్చు. ఈ నెల 18న కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కనుక ఇప్పుడు కేంద్రమంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ తమ పర్యటనలలో కేసీఆర్కి గట్టిగా బదులివవచ్చు.