ఖమ్మం జిల్లాలో సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత మూడున్నరేళ్లుగా కేసీఆర్ పట్టించుకోనప్పటికీ చాలా ఓపికగా ఎదురుచూస్తూ మౌనంగా ఉండిపోయి సంయమనం పాటిస్తున్నారు. అయినా కేసీఆర్ పట్టించుకోకపోగా ఇటీవల ఆయన్ సెక్యూరిటీని తగ్గించి ఎస్కార్ట్ సర్వీసులని తొలగించారు. తద్వారా ఆయన అవసరం బిఆర్ఎస్ పార్టీకి లేదని కేసీఆర్ చెప్పకనే చెప్పిన్నట్లయింది. కనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.
ఈ నెల 18న ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఇందుకోసం మంగళవారం నుంచి ఆయన ఖమ్మం జిల్లాలోని తన అనుచరులతో వరుసగా సమావేశం కానున్నారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి బిజెపిలో చేరుతారని సమాచారం. జనవరి 19న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగబోయే బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనబోతున్నారు. ఆ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఖమ్మం జిల్లాకే చెందిన తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కే కేసీఆర్ టికెట్ ఇవ్వడం ఖాయం కనుక తుమ్మలకి అవకాశం ఉండదు. కనుక మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకొంటున్న తుమ్మల టిడిపిలో చేరవచ్చని తెలుస్తోంది.