రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నేడు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో బిజెపి అధ్వర్యంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఈ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ నటుడు నితిన్, ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్తో భేటీ కానున్నారు.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈనాడూ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుతో, ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. వారి భేటీపై తెలంగాణలో కంటే ఏపీలో చాలా ఎక్కువగా చర్చలు సాగాయి. ఇవాళ్ళ నితిన్, మిథాలీ రాజ్తో జేపీ నడ్డా భేటీ అవుతుండటం గమనిస్తే, బిజెపి వారినందరినీ తన ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే సినీ నటులకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి తరపున ప్రచారం చేసినట్లయితే అధికార టిఆర్ఎస్, వైసీపీల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక వారు ఇతర రాష్ట్రాలలో ప్రచారానికైతే అంగీకరించవచ్చు కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రచారానికి అంగీకరించకపోవచ్చు.