రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా ప్రస్థానం యాత్రలో నిన్న భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మాతో టచ్చులోనే ఉన్నారు. త్వరలో ఆయన కూడా మా పార్టీలో చేరుతారనే నమ్మకంగా ఉన్నాము,” అని అన్నారు.
ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతుండటంతో, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “బిజెపిలో చేరుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్... అంటూ సంభోదించడంతో ఆయనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మూడున్నర దశాబ్ధాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. బయట నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి నేను పార్టీ మారబోతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బండి సంజయ్ కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిజెపితో టచ్చులో ఉన్నారు పార్టీలో చేరబోతున్నారన్నట్లు మాట్లాడటంతో రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అని దృవీకరిస్తున్నట్లయింది. కానీ ఇవాళ్ళ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, “నిన్న నేను అన్న మాటలను బ్రేకింగ్ న్యూస్లో పెట్టొద్దు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ గనుక తన నియోజకవర్గం అభివృద్ధి గురించి అప్పుడప్పుడు ప్రధాని నరేంద్రమోడీని కలుస్తుంటారు. అది సహజమే. దానినే నేను ఆయన మాతో టచ్చులో ఉన్నట్లు చెప్పాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు,” అని అన్నారు.
ఒకవేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని బిజెపిలోకి రారని బండి సంజయ్ భావిస్తున్నట్లయితే, ఆయనకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే విధంగానే మాట్లాడుతారు కానీ ఆయనను కాపాడేందుకు ప్రయత్నించారు కదా?కానీ ప్రయత్నిస్తున్నారంటే అర్ధం ఏమిటి?