భద్రాచలంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం భద్రాచలంలో పర్యటించబోతున్నారు. సిఎం కేసీఆర్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయనుండగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రైలులో వెళుతుండటం విశేషం.
ఇటీవల రాజ్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు బొకే ఇచ్చి ఆమె పక్కనే కూర్చొని కబుర్లు చెప్పడంతో ఆమె పట్ల ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని అందరూ భావించారు. కానీ రాలేదని దీంతో స్పష్టమవుతోంది.
రేపు తనతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కూడా హెలికాప్టర్లో భద్రాచలం ఏరియల్ సర్వేకు తీసుకువెళ్ళవచ్చు లేదా ఆమె భద్రాచలం చేరుకొనేందుకు హెలికాప్టర్ కేటాయించవచ్చు. కానీ ఆమె కూడా రేపు భద్రాచలం పర్యటనకు వెళ్ళబోతున్నట్లు తెలిసి ఉన్నా సిఎం కేసీఆర్ ఆమెను పట్టించుకోకుండా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయబోతుండటం గమనిస్తే ఆమె పట్ల కేసీఆర్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం అవుతోంది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో బయలుదేరి కొత్తగూడెం చేరుకొని అక్కడి రోడ్డు మార్గంలో ముంపు ప్రాంతాలకు చేరుకొని పరిస్థితి పరిశీలించబోతున్నారు. ఇంచుమించు అదే సమయంలో సిఎం కేసీఆర్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయబోతున్నారు.