సిఎం కేసీఆర్ వారం రోజులు రాష్ట్రాల పర్యటనకని బయలుదేరి నాలుగు రోజులలోనే హైదరాబాద్ ఎందుకు వెనక్కి తిరిగి వచ్చారనేది పక్కన పెడితే ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరగా ఆమె నిరాకరించారనే వార్త బయటకి వచ్చింది.
కాంగ్రెస్ను కలుపుకోకుండా జాతీయస్థాయిలో బిజెపిని ఎదిరించలేమని ప్రశాంత్ కిషోర్ పదేపదే చెప్పారు. అయితే కాంగ్రెస్ను కలుపుకోకుండానే కూటమి ఏర్పాటుకి సిఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో కేసీఆర్ ప్రయత్నాలు మళ్ళీ మొదటికి వచ్చాయని అందుకే ఆయన అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగివచ్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కనుక సిఎం కేసీఆర్కు కూడా ఈ తత్వం బోధపడటంతో, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెడితే మద్దతు కూడగడతానని చెప్పాలనుకొన్నారని కానీ ఆమె అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వెనక్కు తిరిగి వచ్చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.