కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ చేరుకొని హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ అధ్వర్యంలో జరుగబోయే రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకొని బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణాలో రాత్రి బస చేస్తారు.
రేపు ఉదయం అక్కడే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్భంగా రేపు మధ్యాహ్నం 12.50 గంటలకు ఖైరతాబాద్ వద్ద గల సంజీవయ్య పార్క్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పిస్తారు. తరువాత అక్కడి నుంచి గాంధీభవన్ చేరుకొని పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత అమరవీరుల కుటుంబాలతో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం 5.50 గతలకు మళ్ళీ ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.
రాహుల్ గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన షెడ్యూల్ గమనిస్తే దీనిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపయోగపడేది నేడు వరంగల్లో జరుగబోయే సభ మాత్రమే అని అర్ధమవుతోంది. అయితే ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేయగలరా?సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఈ పర్యటనలో కనీసం పార్టీ నేతల కుమ్ములాటలైనా ఆయన పరిష్కరించగలిగితే పార్టీకి ఎంతో మేలు చేసినవారవుతారు కదా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.