ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని ప్రకటించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు “హమ్మయ్య... తొందరగానే మన శని వదిలింది...” అని చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే, ఇన్నేళ్ళుగా తాము సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీల ఒత్తిళ్లను తట్టుకొంటూ వారితో అలుపెరుగని పోరాటాలు చేస్తుంటే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కారణంగా అదే పార్టీతో పొత్తులు పెట్టుకొంటే ఏ మొహం పెట్టుకొని జనం వద్దకు వెళ్ళగలం? వెళితే జనం ఛీ కొట్టరా?అని అడుగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే అతనితో కూడా పెద్ద సమస్య ఎదురయ్యేదని వారు ఆందోళన చెందారు. కారణాలు ఏవైతేనేమి ప్రశాంత్ కిషోర్ తనంతట తానే కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రకటించేయడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకొంటున్నారు.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వెళ్ళి సిఎం కేసీఆర్తో అంటకాగినా తమకేమి అభ్యంతరంలేదని, వచ్చే ఎన్నికలలో వారిద్దరినీ ఎదుర్కోవడానికి తామందరం సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.
అయితే నేటికీ పికే వచ్చే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయవచ్చనే మాట వారికి ఆందోళన కలిగిస్తోంది. కానీ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి పనిచేస్తారు కనుక తమకు దూరంగా ఉంటారని భావిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ కేవలం డబ్బు కోసం ఈవిదంగా రెండు శత్రు పార్టీలకు ఒకేసారి పనిచేయబోతుండటంతో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. చివరికి ఆయనకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో?