ఈరోజు మాదాపూర్ హెచ్ఐసిసిలో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సభలో సిఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ, జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం ఖాయం అన్నట్లు చెప్పారు. తొలిసారిగా ఆయన నోట ‘భారత్ రాష్ట్ర సమితి’ అనే పేరు కూడా వినపడింది. జాతీయస్థాయి రాజకీయాల కోసం టిఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలంటూ చాలామంది సూచిస్తున్నారని సిఎం కేసీఆర్ చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడమంటే కొన్ని పార్టీల గుంపుని ఏర్పాటు చేయడం కాదని, ఒక గొప్ప అజెండాతో ముందుకు వెళ్ళడం అని, అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవుతుందంటే మన అందరికీ గర్వకారణమని సిఎం కేసీఆర్ అనడం గమనిస్తే, ఆయన టిఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. అప్పుడు ఇతర రాష్ట్రాలలో బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకొని కేవలం లోక్సభ ఎన్నికలలో మాత్రం పోటీ చేయాలని భావిస్తున్నారేమో?రాబోయే రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.