సిఎం కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీతో జోడించాలని ప్రయత్నించిన ప్రశాంత్ కిషోర్, చివరికి తానే కాంగ్రెస్ పార్టీకి దూరం అవడం విశేషం.
కాంగ్రెస్ను కలుపుకోకుండా జాతీయ స్థాయిలో బిజెపిని ఎదిరించలేమని గట్టిగా వాదించిన ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధిష్టానంతో వరుస భేటీల తరువాత నేరుగా హైదరాబాద్ వచ్చి సిఎం కేసీఆర్తో వరుసగా రెండురోజులు భేటీ అయ్యారు. కాంగ్రెస్తో చేతులు కలపాలని మళ్ళీ కోరగా, కాంగ్రెస్ను కలుపుకోకుండానే ఏవిదంగా బిజెపిని ఎదుర్కోవచ్చో సిఎం కేసీఆర్ ఆయనకు వివరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాతే ప్రశాంత్ కిషోర్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని ట్వీట్ ద్వారా ప్రకటించారు. అంటే సిఎం కేసీఆర్కు మార్గదర్శనం చేయబోయి ఆయన దారికే ప్రశాంత్ కిషోర్ వచ్చినట్లు అర్ధమవుతోంది. కనుక ఆయన సిఎం కేసీఆర్ వైపే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరడం లేదు కనుక టిఆర్ఎస్ కొరకు బహిరంగంగానే పనిచేయవచ్చు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందుకు అభ్యంతరం చెప్పలేరు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా వచ్చే లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తగినన్ని సీట్లు రానట్లయితే, అప్పుడు సిఎం కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ దానికి మద్దతు కిచ్చి కేంద్రంలో చక్రం తిప్పవచ్చు.